హైదరాబాద్ : దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతన్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదవుతున్నాయంటే కరోనా ఏ విధంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ పాజిటివిటీ రేటు కూడా విపరీతంగా పెరుగుతోంది. రెండు వారాల కిందట ఆ దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 25 శాతానికి పెరిగింది.
అయితే తాజాగా ఆ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా మాట్లాడుతూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా నాలుగో వేవ్ నడుస్తోందని తెలిపారు. మరికొన్నివారాల్లో వైరస్ సంక్రమణ రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు త్వరలోనే జాతీయ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అయితే దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కేవలం 36.8 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవడం ఆందోళనకర విషయం. ఇంకా 63 శాతం వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంది. కావున అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అక్కడి అధికారులు కోరుతున్నారు.