మేడారం : మేడారం జాతర కోసం దాదాపు 1100 ఎకరాలను వినియోగిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే జాతర కోసం వారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేడారం జాతరకు రైతుల భూములు వినియెగించుకుంటున్నామని.. వారికి ఎకరాకు 6 వేల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. జాతర కోసం దాదాపు 1100 ఎకరాలు వినియోగిస్తున్నామని.. అందరికీ పారితోషికం అందిస్తామన్నారు. మేడారంలో 200 ఎకరాలు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. భూములు విక్రయించేందుకు రైతులు అంగీకరిస్తే కొనుగోలు చేస్తామన్నారు. మేడారం జాతర కోసం ఈసారి 8 వేల బస్సులను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
మేడారం పరిసర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయ న్నారు.జంపన్న వాగులో చెక్ డ్యాంల వల్ల గతంలో చాలా మంది చనిపోయారని.. అందుకే చెక్ డ్యాంలు తొలగించామని చెప్పారు. కోవిడ్ ఉధృతి కారణంగా మేడారం జాతర మూసేస్తారేమోనన్న భయంతో భక్తులు ముందే దర్శనానికి వస్తున్నారని చెప్పారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. దర్శనాలకు స్లాట్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. వీఐపీ పాస్లు కూడా జారీ చేస్తామని చెప్పారు. మేడారంలో సిబ్బంది మూడు షిఫ్టులలో పనిచేస్తారనితెలిపారు. నీటి సమస్య లేకుండా భారీ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని.. పార్కింగ్ ఏరియాలోనే టాయిలెట్స్. తాగు నీరు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.