హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.1.80 కోట్ల విలువగల గంజాయిను పోలీసులు పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిపెన్ రవీంద్ర శుక్రవారం నిందితుల వివరాలను విలేకరులకు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి ఒడిశాలోని కొరపుట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు గంజాయిని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు, మియాపూర్ పోలీసుల సహకారంతో ఈముఠాను పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.80 కోట్ల విలువ చేసే 800 కిలోల గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు వికాస్ జాధవ్, సుభాష్ కుమార్ లు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm