జైపూర్ : రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన మహిళపై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ నగ్నంగా 500 మీటర్ల దూరం పరిగెత్తి స్థానికులకు విషయం తెలిపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాఢోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ గ్రామానికి ఓ గిరిజన మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ముగ్గురు దుండగులు ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి రాగానే మహిళను అడ్డగించారు. అనంతరం ఇద్దరు యువకులు ఆ మహిళను రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. మరో వ్యక్తి బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత మహిళపై ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత తేరుకున్న బాధిత మహిళ నగ్నంగా 500 మీటర్ల దూరంలో ఉన్న బాఘ్పూరా చౌక్వరకు వెళ్లింది. అక్కడి స్థానికులకు జరిగిన విషయాన్ని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళ చీర, ఓ చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు.బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షలకు పంపించి నిందితుల కోసం గాలిస్తున్నారు.