బెంగళూరు: ఏటీఎం చోరీకి గ్యాస్ కట్టర్తో దొంగలు యత్నించగా.. రూ.19 లక్షల నగదు దగ్ధమైంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వివరాల్లోకెళ్తే.. పరప్పన అగ్రహార సమీపంలోని హోస రోడ్డులో ఉన్న కెనరా బ్యాంకు ఏటీఎం చోరీకి ఈ నెల 14 అర్ధ రాత్రి తర్వాత దొంగలు యత్నించారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఏటీఎం తెరుచుకోలేదు. మరోవైపు గ్యాస్ కట్టర్ మంటలకు ఏటీఎంలోని రూ.19 లక్షల విలువైన కరెన్సీ నోట్లు కాలిపోయాయి. దాంతో ఆ ఏటీఎంను నిర్వహించే సెక్యూరిటీ సంస్థ వారం రోజులు ఆలస్యంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. లీగల్ టీంతో సంప్రదింపుల నేపథ్యంలో ఫిర్యాదు చేయడంలో ఆలస్యం అయినట్టు ఆ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ సంస్థ.. సీసీటీవీ ఫుటేజ్ను ఇంకా తమకు అందజేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. దీని కోసం ఆ సంస్థ నుంచి స్పష్టత కోరినట్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm