దావోస్ : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ పోరంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాష్ర్టంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండగా పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. తాజాగా తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్తో హ్యుందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు హ్యుందాయ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఎకో సిస్టమ్ అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు హుందాయ్ తెలిపింది.