హైదరాబాద్ : ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆగస్టు వరకు మరో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారని చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బేగంపేటలో మోడీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తల్లిని చంపి పిల్లను బతికించారన్న మోడీకి తెలంగాణ అమరవీరుల గురించి ఉచ్చరించే అర్హత కూడా లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని అమ్ముతుంటే ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కొంటున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 100 లక్షల కోట్ల అప్పు చేశారని.. రూ. 4వేల కోట్లు పెట్టి తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనమంటే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను నింపడం చేతకాని మోడీ.. యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm