అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగంలో తనతో పాటు మరికొందరు విద్యార్థులను పరీక్షల్లో కావాలనే ఫెయిల్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు విద్యార్థి రంగరాజుల గోపీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిలబస్లో లేని ప్రశ్నలు 50 శాతం ప్రశ్నపత్రంలో రావడంతో బోధకులను నిలదీశామని, దీనిపై కక్ష పెట్టుకొని ఫెయిల్ చేశారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేయడం యూజీసీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయం అధికారులు స్పందించి ప్రత్యేక కమిటీ వేయాలని, జవాబు పత్రాలను ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన అర్హులైన బోధకులతో పునఃమూల్యాంకనం చేయించాలన్నారు. అయితే ఈ విషయమై ఎచ్చెర్ల ఎస్సై కె.రామును అడగగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm