హైదరాబాద్ : పెండ్లైన మహిళతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు వారికి వివాహం జరిపించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షికార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగౌలి గ్రామంలో వెలుగుచూసింది.
వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన సుశీలదేవి భర్త బతుకుదెరువు కోసం ముంబైలో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.అయితే ఆమె సెమ్రాచౌక్లో మొబైల్ షాపునకు రిచార్జ్ నిమిత్తం తరచూ వెళ్లేది. ఈ క్రమంలో షాపు నడుపుతున్న వినోద్రామ్ అనే యువకుడితో ఆమెకు పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఆమె ఇంట్లోనే కలుసుకునేవారు. ఇదిలా సాగుతుండగా
గురువారం అర్ధరాత్రి వినోద్రామ్.. సుశీలదీవి ఇంటికి వెళ్లాడు. అది గమనించిన గ్రామస్తులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి తాడుతో కట్టేశారు. అనంతరం ఇద్దరినీ రాత్రంతా చితకబాదారు. తెల్లవారుజామున గ్రామస్తుల సమక్షంలో ఇద్దరికి పెండ్లి చేశారు. ఇదంతా జరిగిన తర్వాత సుశీలదేవి, వినోద్రామ్ ఇద్దరూ గ్రామం విడిచి వెళ్లిపోయారు.
అయితే వారికి దేహశుద్ధి చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకొని విచారిస్తామన్నారు.