హైదరాబాద్: డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ సహచరి, దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కరెక్ట్ లొకేషన్ ను హర్యానా సిట్ అధికారులు పట్టేశారు. సెప్టెంబర్ 2న నేపాల్ లోని ఖాట్మాండూ సమీపంలో కనిపించిందని గుర్తించిన సిట్ అధికారులు, దానిని నిర్ధారించుకునేందుకు వేచి చూశారు. అయితే నేపాల్ లోని ధరన్ ఇటహరి ప్రాంతంలో హనీప్రీత్ తలదాచుకున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆమెను పట్టుకుని భారత్ కు తీసుకురావడమే మిగిలి ఉందని తెలుస్తోంది. మరోవైపు గుర్మీత్ కు శిక్ష విధించిన సందర్భంగా హర్యానా, పంజాబ్ లలో చెలరేగిన అల్లర్ల వెనుక హనీప్రీత్, ప్రధాన అనుచరుడు ఆదిత్యల హస్తమున్నట్టు హర్యానా పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే నేపాల్ నుంచి వారిని తీసుకురానున్నట్టు సమాచారం. కాగా, నేపాల్ లో కూడా గుర్మీత్ రాం రహీంకు భక్తులు ఉన్నారని తెలుస్తోంది. నేపాల్ భూకంపం సమయంలో గుర్మీత్ అక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టారని సమాచారం. దీంతో బాధితులను ఆదుకున్నారని, తరువాత అక్కడ కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారని, అందులో కూడా భక్తి కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm