భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా పోలీసులు ఓ నక్సలైట్ ను అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం సిద్దారం అడవిలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు, నక్సల్స్ కు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా వివరాలు వెల్లడించారు. సిద్ధారం అటవీ ప్రాంతంలో ఎన్డీ అజ్ఞాత రామన్న దళం సంచిరిస్తున్నట్లు బోడు ఎస్ఐకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ తిరుపతి, స్పేషల్ పార్టీ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన రామన్నదళం ఒక్కసారిగా కాల్పులు జరిపింది. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రామన్న దళ సభ్యులు తప్పించుకున్నారు. కాగా మడివి భీమా అలియాస్ గౌతమ్ అనే ఆదివాసి దళ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలం నుంచి రెండు రైఫిళ్లు, ఒక రివాల్వర్, 8 ఎంఎం బుల్లెట్లు, సాహితీ నవలలు, ఆలీవ్ గ్రీన్ దుస్తులు స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm