హైదరాబాద్: ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారావు అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి మీడియాతో మాట్లాడారు.. కంచె ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో బతుకమ్మ చీరల వివాదంపై స్పందించిన ఆయన.. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్లు చీరలను తగులబెట్టిస్తున్నారని చెప్పారు. హోంగార్డుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న హోంమంత్రి.. ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. కాగా, ఆర్య వైశ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కంచె ఐలయ్య పుస్తకం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపింది. ఈ నేపథ్యంలో కంచె ఐలయ్యపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్యవైశ్యులు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి పై విధంగా స్పందించారు.
Mon Jan 19, 2015 06:51 pm