హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో దళితులపై దాడి చేసిన బిజెపి నేత భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. భరత్ రెడ్డిపై ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసు నమోదై వారం కావస్తున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడమేంటని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నవీపేట మండల కేంద్రంలో దళిత సంఘాల ఆద్వర్యంలో భరత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భరత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. మొరం అనుమతులు, తవ్వకాలపై నిలదీయడంతో గ్రామానికి చెందిన లక్ష్మణ్, రాజేశ్వర్లపై భరత్ రెడ్డి దాడి చేశాడు. చేత కర్రపట్టుకుని బడిపిల్లలను బాదినట్లు బాదడంతో పాటు రెండు చేతులు కట్టుకోవాలని, తప్పుచేశామని ఒప్పుకోవాలని భరత్ రెడ్డి రాయలేని భాషల్లో బూతులు తిడుతూ వెంటపడ్డాడు. పక్కనే ఉన్న ఓ నీటిగుంటలోకి వెళ్లి మునగాలంటూ ఆదేశాలిచ్చాడు. వారు నీట మునిగేలా ఆంక్షలు విధించాడు. ఆ తర్వాత ముక్కు నేలకు రాయించాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరత్ రెడ్డిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ఏసీపీ సుదర్శన్ అభంగపట్నంలో పర్యటించారు. బాధితులైన లక్ష్మణ్, రాజేశ్వర్ ఇళ్లకు వెళ్లి విచారణ కూడా జరిపారు. అయితే భరత్ రెడ్డి అరెస్ట్ విషయంలో జాప్యం జరగడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm