అబ్దుల్లాపూర్మెట్ : సరైన వసతి, దాణా లేకపోవడంతో వరుసగా ఒంటెలు మృత్యువాతపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడలో 2 ఒంటెలు శనివారం మృతిచెందాయి. దీంతో రెండు రోజుల వ్యవధిలో మృతి చెందిన ఒంటెల సంఖ్య 11కి చేరింది. బాలాపూర్ షాహిన్నగర్లో ఒంటెలను నిర్బంధించారనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. మాంసం విక్రయాల కోసం రాజస్థాన్ నుంచి అక్రమంగా ఈ ఒంటెలను బాలాపూర్కు తరలించి నిర్బంధించినట్లు పోలీసులు గుర్తించారు. నిర్బంధంలో ఉన్న 90 ఒంటెలను విడిపించి బలిజగూడకు తరలించారు. అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగించారు. ఒంటెలను అధికారులు బలిజగూడ ఫామ్కు తరలించారు. అయితే సరైన వసతి లేకపోవడంతో వరుసగా ఒంటెలు మృత్యువాత పడుతున్నాయి. ఒంటెలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm