మహరాజ్గంజ్: దొంగతనం నేరంపై ఓ బాలుడిని పోలీసు స్టేషన్లో ఇద్దరు పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కొట్టొద్దంటూ ఆ మైనర్ కాళ్లావేళ్లా పడినా లెక్కచేయలేదు. లాఠీలతో చితకబాదారు. బూట్లకాళ్లతో తన్నారు. చెంపలు వాయగొట్టారు. అర చేతులు చిట్లిపోయేలా లాఠీలతో మోదారు. వీటికి తోడు పొడగాటి కర్రను రెండు కాళ్ల మధ్యనా ఉంచి చెరోవైపు ఇద్దరు పోలీసులు దానిపై నుంచుని అతన్ని చిత్రహింసల పాలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లా పోలీస్ స్టేషన్లోని కాంపౌండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, వీడియో ఎవరు తీశారనేది వెంటనే తెలియలేదు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు మహారాజ్ గంజ్ పోలీసు ఉన్నతాధికారి రాకేష్ ప్రతాప్ సింగ్ తెలిపారు. వీడియోలో కనిపించిన సబ్ ఇన్స్పెక్టర్ కేఎన్ షాహిని సస్పెండ్ చేశారు. బాధిత టీనేజర్ తన గ్రామంలో దొంగతనం చేసినట్టు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకువచ్చి అత్యంత కిరాతకంగా కొట్టారు. అయితే అతన్ని అరెస్టు చేశారా, విడిచిపెట్టారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm