బెంగళూరు : ఓ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సర్జాపూర్ రోడ్డులో గురువారం ఉదయం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. సర్జాపూర్ రోడ్డులో భీమ్ శేఖర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నాడు. దినేష్(30) అనే వ్యాపారవేత్త ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు.. కారును ఆపాడు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకు, సీటు బెల్ట్ ధరించనందుకు దినేష్కు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చాడు. నా కారును ఆపి.. నాకే జరిమానా విధించే ధైర్యం ఎక్కడిది? అంటూ దుర్భషలాడుతూ.. కారులో నుంచి బేస్ బాల్ బ్యాట్ తీసుకుని ట్రాఫిక్ కానిస్టేబుల్పై దినేష్ దాడి చేశాడు. దారుణంగా చితకబాదాడు. ఈ క్రమంలో అక్కడ వాహనదారులు గుమిగూడారు. ఇంతలోనే దినేష్ అటు నుంచి తప్పించుకున్నాడు. మొత్తానికి భీమ్ శేఖర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త దినేష్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm