బోడుప్పల్: మొదటి భార్యను వదిలేశాడు.. రెండో పెళ్లి చేసుకొని ఆడపిల్ల పుట్టిందని ఆమెనూ గెంటేశాడు. పక్కింటి అమ్మాయిని ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నాడు.. తనకు న్యాయం చేయాలని కోరిన రెండో భార్యపై చేయి చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్కి చెందిన పులకండ్ల శ్రీనివాస్రెడ్డి(36) స్థిరాస్తి వ్యాపారి. ప్రస్తుతం అధికార పార్టీ తెరాసకు అనుబంధంగా కొనసాగుతున్నాడు. 2012లో వరంగల్ జిల్లాకు చెందిన యువతితో శ్రీనివాస్రెడ్డికి వివాహమైంది. కొన్నాళ్లకు ఆమె అతనితో విడిపోయింది. 2013లో శేరిలింగంపల్లికి చెందిన సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. సరిగా చూసుకోకపోవడంతో భార్య సంగీత, కుమార్తెతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. భర్త శ్రీనివాస్రెడ్డిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ సంగీత గతంలో చందానగర్, మేడిపల్లి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు శ్రీనివాస్రెడ్డిని అప్పట్లో రిమాండ్కు తరలించారు. బయటకు వచ్చిన శ్రీనివాస్రెడ్డి అదే కాలనీలో నివాసముండే మరో యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం సంగీత కుమార్తెతో కలిసి భర్త ఇంటికి వచ్చి తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో శ్రీనివాస్రెడ్డి.. సంగీతపై చేయిచేసుకొని తోసివేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే శ్రీనివాస్రెడ్డి అక్కడి నుంచి పరారీ అయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm