చెన్నై: ఇప్పటికే ఐటీ సోదాల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న శశికళ బంధువులపై మరో పంజా పడనుంది. గతంలో పలు ఆరోపణలకు సంబంధించి వారిపై నమోదైన కేసులను తిరగదోడి చర్యలు చేపట్టాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే రంగంలోకి దిగి పాత కేసుల జాబితా సిద్ధం చేస్తోంది. శశికళ బంధువులు, సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మెగా ఐటీ సోదాలు జరగ్గా.. అందులో చిక్కిన దస్త్రాల ఆధారంగా ప్రస్తుతం పలువురికి ఐటీ అధికారులు నోటీసులు పంపి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.కోట్లలో పన్నుల ఎగవేత, రూ.వేల కోట్ల లెక్కకురాని ఆస్తులకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఐటీ సోదాల వేడి చల్లారక ముందే శశికళ బంధుగణంపై మరో దాడి్కి రంగం సిద్ధమైంది. తిరుచ్చి కొట్టపట్టులో ఏడెకరాల భూమి విక్రయించడానికి తిల్లైనగర్కు చెందిన వరదరాజన్ నుంచి రూ.1.60 కోట్లు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలపై 2007లో నటరాజన్, ఆయన బంధువులపై కేసు నమోదైంది. అదేవిధంగా నటరాజన్ మాజీ బినామీగా పేరుగాంచిన తంజావూరు కావేరి నగర్కు చెందిన శివకుమార్.. తమిళ్నగర్కు చెందిన శకుంతల ఇంటిని జేసీబీతో ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నట్లు 2011లో తంజావూరు వైద్య కళాశాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తంజావూరు విళార్ గ్రామంలో రామలింగం అనే వ్యక్తి.. తన 15 వేల చదరపు అడుగుల స్థలాన్ని నకిలీ పత్రాలతో ఆక్రమించినట్లు నటరాజన్, ఆయన సోదరుడు స్వామినాథన్ తదితరులపై ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారంలో శశికళ సోదరుడు దివాకరన్ కట్ట పంచాయితీ చేసి శరవణన్ను చంపుతామని బెదిరించి రూ.లక్ష తీసుకున్నట్లు కూడా ఫిర్యాదు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm