కాకినాడ: రాయపూడి సురేష్ నోటి గుండా దూసుకెళ్లి మెడ భాగం నుంచి బయటకు వచ్చి ప్రాణాంతకంగా మారిన ఇనుప వూసను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్) వైద్యులు ఆదివారం తొలగించారు. అయిదు విభాగాలకు చెందిన 25 మంది వైద్యులు అయిదు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. జీజీహెచ్ పర్యవేక్షణాధికారి డా.ఎం.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శస్త్రచికిత్స జీజీహెచ్లోని ఈవోటిలో శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై తెల్లవారుఝాము 3 గంటల వరకు కొనసాగింది. శస్త్రచికిత్స నిర్వహణపై డా.ఎం.రాఘవేంద్రరావు మాట్లాడుతూ బాధితుడికి శస్త్రచికిత్స నిర్వహించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను సిద్ధం చేశామన్నారు. డా.ఎస్.వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని శస్త్రచికిత్స నిపుణులు, డా.జీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలోని ఈఎన్టీ వైద్య బృందం, డా.ప్రేమ్జిత్రే, డా.గిరి ఆధ్వర్యంలోని న్యూరో సర్జరీ వైద్యులు, డా.సౌభాగ్యలక్ష్మి పర్యవేక్షణలో మత్తు వైద్య నిపుణులు, రేడియాలజి విభాగం నుంచి డా.బి.అనురాధ, డా.రాధారాణి బృందం, సీఎంవో డా.కరీముల్లాహ్ శస్త్రచికిత్సలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారి సహకారంతో నిరంతరం బాధితుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రయాసలకోర్చి అడుగున్నర పొడుగున్న ఇనుప వూసను తొలగించామన్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. కాకినాడ జీజీహెచ్లో అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉండగా నిష్ణాతులైన వైద్య బృందం ఉత్తమ సేవలు అందించేందుకు శ్రమిస్తారన్నారు. సురేష్కు వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరించగా ఇక్కడి వైద్యులు అతడి ప్రాణాలను నిలిపారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm