అహ్మదాబాద్: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటిదాకా ఆ పార్టీకి మద్దతిచ్చిన పటేల్ వర్గీయులు తాజాగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. కాంగ్రెస్, పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) మధ్య సీట్ల ఒప్పందంలో వచ్చిన భేదాభిప్రాయాలే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..హార్దిక్ పటేల్ నాయకత్వం వహిస్తున్న పాస్కు గుజరాత్ ఎన్నికల్లో స్థానాల కేటాయింపుపై విస్తృత చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పటేల్ కమ్యూనిటీతో ఒప్పందం కుదిరి.. కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 77 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు హార్దిక్ పటేల్ సన్నిహితులకు టికెట్ లభించింది. తాము ఆశించిన మేర టికెట్లను కేటాయించలేదని, తమను సంప్రదించకుండానే సీట్ల ఒప్పందం జరిగిందని పాటిదార్ ఆందోళన్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాస్ సభ్యులు కొందరు ఆదివారం రాత్రి సూరత్లోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. సూరత్లోనే గాక.. అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ పటేల్ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm