తమిళనాట తమపై వరుసగా జరుగుతున్న దాడులకు జయలలితే కారణమని శశికళ కుటుంబీకులు సంచలన ఆరోపణలు చేశారు. తాను మరణించిన తరువాత శశికళ పరిస్థితి ఏంటన్న విషయాన్ని జయలలిత ఎంతమాత్రమూ పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని శశికళ సోదరుడు వీ దివాకరన్ వ్యాఖ్యానించారు. మన్నార్ గుడి మాఫియాలో కీలక వ్యక్తిగా చెప్పుకునే దివాకరన్, మీడియాతో మాట్లాడుతూ, జయలలిత తప్పిదాలే తమ పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు. శశికళను పూర్తిగా వాడుకున్న జయలలిత, ఆమె క్షేమం కోసం ఏమీ చేయేలేదని అన్నారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ సైతం ఇదే విధమైన ఆరోపణలు చేయడం గమనార్హం.అమ్మఃతో కలిసున్న కారణంగానే శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి అమ్మేనని అన్నారు. శశికళ కుటుంబీకులు చేసిన మోసం కారణంగానే జయలలితపై కేసు నమోదైందని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అదే జరిగి, మేమే అమ్మను మోసం చేసుంటే, ఆమె దోషిగా ఎలా తేలిందని మీడియాను దినకరన్ ఎదురు ప్రశ్నించారు. జయలలిత మరణం తరువాత తమ కుటుంబానికి కష్టాలు వచ్చాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm