పలు వివాదాల మధ్య నలుగుతున్న పద్మావతి చిత్రం డిసెంబర్ 1న విడుదల కావడం దాదాపు కష్టమేనని అనిపిస్తుంది. మొన్నటి వరకు రాజ్పుత్ కర్ణిసేన మాత్రమే ఈ మూవీకి అడ్డుపడితే ఇప్పుడు పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి, స్మృతి ఇరానీకి లేఖలు కూడా రాశారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమాను నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పద్మావతి చిత్రానికి బాసటగా నిలిచారు. సినిమాపై కొనసాగుతున్న ఈ వివాదం చాలా దురదృష్టకరమని అన్న దీదీ.. స్వేచ్చని నాశనం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ కంకణం కట్టుకుందని ఇది , దారుణమని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఇలాంటి హింసాత్మక చర్యలపై పోరాడేందుకు ఇండస్ట్రీ మొత్తం కలిసి కట్టుగా నిలబడాలని దీదీ అన్నారు. ఇప్పటికే పద్మావతి చిత్రానికి సల్మాన్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, ప్రకాశ్ రాజ్,షబానా అజ్మీ, హాలీవుడ్ నటి రూబీ తమ మద్దతు తెలిపారు. పద్మావతి విషయంలో ఇండస్ట్రీ అంతా కలిసి కట్టుగా పోరాడితే కాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అంటూ పలువురు వాపోతున్నారు. మరి ఈ వివాదం ఇంకెన్నాళ్ళు సాగుతుందో చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm