హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ నటుడు పోసారి కృష్ణమురళి ఘాటుగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తాము ఎన్నారైలు అయితే లోకేష్ ఎవరని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ తిట్టలేదని చెప్పారు. ఏపీ రాజకీయ నేతలను మాత్రమే తిట్టారని అన్నారు. లోకేష్ కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... మమ్మల్ని తరిమికొట్టేవారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని పోసాని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అయితే... తాము తెలుగు రోహింగ్యాలమవుతామని చెప్పారు. తెలంగాణలో పన్నులు కడుతున్నందుకు... తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? మీకేమైనా బుద్ధి, జ్ఞానం ఉందా? చదువుకున్నారా? 'తెలంగాణలో మీరు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా... ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని సూచించారు. మీలాంటి నేత ఉమ్మడి ఏపీలో ఉండి ఉంటే తాము నాశనం అయ్యావారమని చెప్పారు. నంది అవార్డులను విమర్శించినంత మాత్రాన తమను నాన్ లోకల్ అంటారా అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా? అని ప్రశ్నించారు. తనకు ఈ అవార్డు వద్దని... ఒకవేళ తీసుకుంటే, 'కమ్మోడు కాబట్టి వీడికి అవార్డు ఇచ్చారు' అంటారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టుగానే ఐవీఆర్ఎస్ పద్ధతిలో విజేతలను ఎంపిక చేయాలని అన్నారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా అని అన్నారు. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని చెప్పారు. నంది అవార్డులను రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm