హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్కుమార్రెడ్డి టీడీపీలో చేరతారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు విజయవాడలో కిషోర్ కుమార్తో పాటు ఆయన మద్దతుదారులు కొందరు టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నల్లారి కుటుంబంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒక పద్ధతి లేకుండా రాష్ట్ర విభజన జరుగుతోంటే కిరణ్కుమార్రెడ్డి పోరాడారని, ఓ పక్క సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి కలిసి కుట్రలు పన్నుతోంటే కిరణ్కుమార్రెడ్డి మాత్రం ఎంతో చిత్తశుద్ధితో పని చేశారని అన్నారు. కాగా, కిషోర్కుమార్రెడ్డి ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని, పీలేరులో ఇకపై పూర్తిగా ఏకపక్షంగా తమకు మెజారిటీ వస్తుందని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం మొత్తం 8 సార్లు గెలిచిందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm