చెన్నై: రాజకీయ నాయకుడు కానప్పటికీ.. సమకాలీన రాజకీయ అంశాలపై వెంటనే స్పందిస్తుంటారు నటుడు ప్రకాశ్ రాజ్. అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తుంటారు. ఈ విమర్శల నేపథ్యంలోనే తాజాగా ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీపై ప్రకాశ్ రాజ్.. అంతేస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ వ్యాఖ్యలను తనను వ్యక్తిగతంగా చాలా బాధించాయని, ఆయన తనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ లీగల్ నోటీసులు పంపించారు. నటుడు ప్రకాశ్ రాజ్ గత కొంతకాలంగా తన దూకుడు పెంచారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు తూర్పారపడుతున్నారు. ఇటీవల ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య ఘటనపైనా స్పందించిన ప్రకాశ్ రాజ్.. దీనిపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు సహా, జీఎస్టీ, మతపరమైన దాడులను ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. మోదీ తనకన్నా మంచి నటుడు అని విమర్శించారు. హిందువులను తీవ్రవాదులతో పోల్చారు. ఈ విమర్శలపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ తీవ్రంగా స్పందించారు. ప్రకాశ్ రాజ్పై అంతే ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. స్వప్రయోజనం కోసమే ప్రకాశ్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కుమారుడు మృతి చెందిన వెంటనే భార్యను వదిలేసి, ఓ డ్యాన్సర్ వెనకాల వెళ్లిపోయిన ప్రకాశ్రాజ్కు మోదీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అవసరానికి తగ్గట్లు వ్యవహరిస్తూ.. కన్నడలో ప్రకాశ్ రాయ్, తమిళంలో ప్రకాశ్ రాజ్గా తన పేర్లు మార్చుకుంటున్నాడని ఎంపీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఎంపీకి లీగల్ నోటీసులు పంపించినట్లు చెప్పారు. ఆయన నుంచి సమాధానం రాకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm