ఢిల్లీ : జీఎస్టీ వల్ల ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని గతంలో కొందరు అన్నారని, అలాగే గుజరాత్లోనూ ఓడిపోతుందని తాజాగా అన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కానీ, తమ పార్టీ గెలిచి చూపించిందని, ప్రజలు జీఎస్టీకి మద్దతు తెలిపి తమకు అండగా నిలిచారని ఉద్ఘాటించారు. గుజరాత్, హిమాచల్ ప్రజలు అభివృద్ధికి పట్టం గట్టారని తెలిపారు. బీజేపీకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారంటే ప్రజలు దేశంలో సంస్కరణలు, మార్పులు కోరుకుంటున్నారని అర్థం అని మోడీ అన్నారు.
గుజరాత్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమైనదని, ఈ కాలంలోనూ వరుసగా ఎంతో కాలంగా ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తూ వస్తోందని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారని చెప్పడానికి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని మోడీ అన్నారు. గుజరాత్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు పన్నిందని, ప్రజలు వాటిని తిప్పికొట్టారని అన్నారు. గుజరాత్లో విజయం తనకు రెట్టింపు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తాను రాష్ట్రం విడిచి వెళ్లినా గుజరాత్ బీజేపీ నేతలు అభివృద్ధి కొనసాగించారని చెప్పారు. ఆ రాష్ట్రంలో సుపరిపాలన వల్లే ప్రజలు తమకు మళ్లీ అవకాశం ఇచ్చారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 18,2017 07:08PM