మునుగోడు : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి తల్లీ, కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చుక్క మారమ్మ (59) భర్త పదేళ్ల క్రితం మృతి చెందడంతో కుమారుడు చుక్క యాదయ్య (40) వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటుంది. తల్లీ కొడుకులు కలిసి గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా పత్తి సాగు చేస్తుండగా దిగుబడి సరిగా రాక సుమారు రూ.10 లక్షల మేర అప్పులయ్యాయి. ఈ సంవత్సరం కూడా అనుకున్న మేరకు దిగుబడి రాక పోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కల్లులో మోనోక్రోటోఫాస్(పురుగుల మందు) కలుపుకొని తల్లీ కొడుకులు తాగి ఇంట్లో నిద్రించారు. కుటుంబ సభ్యులు గమనించే సరికి మృతి చెంది ఉన్నారు. ఎస్ఐ రాములు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యాదయ్యకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm