న్యూఢిల్లీ: మనీలాండరింగ్ పై కేంద్రం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రూ.6లక్షలపైగా విలువైన నగలు, విలాసవస్తువులు కొంటే...ఆయా కొనుగోళ్లపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుశాఖ, రెవెన్యూ ఇంటలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించింది. ఆరులక్షల రూపాయలకు పైగా బంగారు నగలు, వజ్రాభరణాలు, విలాస వస్తువులను కొనుగోలు చేసే అలాంటి లావాదేవీలను పరిశీలించాలని కేంద్రం వివిధ కేంద్ర నిఘా విభాగాల అధికారులను ఆదేశించింది. షెల్ కంపెనీలు పెట్టి వాటి పేరిట బినామీ లావాదేవీలు నిర్వహిస్తూ మనీలాండరింగ్ కు పాల్పడుతున్న వారిపై కేంద్రం నిఘా వేయాలని నిర్ణయించింది. గతంలో నగదు లావాదేవీలు రెండులక్షలకు మించి చేయరాదని నిబంధన విధించిన కేంద్రం యాభైవేల రూపాయలకు పైగా జరిపిన లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరిగా వేయాలని ఆదేశించింది. దీంతోపాటు రూ.50లక్షలకు పైగా జరిపిన స్థిరాస్తుల కొనుగోళ్లను కూడా ఆదాయపు పన్ను శాఖ పరిశీలించనుంది. దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకే కొత్త నిబంధనలు విధించినట్లు కేంద్ర అధికారులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm