హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్లోని పార్క్హయత్లో జరిగిన 'ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్'లో ప్రకాశ్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టిలో మోడీ, హెగ్దే, అమిత్షా హిందువులే కాదని చెప్పారు. తనను హిందూ వ్యతిరేకి అని వారంటున్నారని.. తాను హిందూ వ్యతిరేకిని కాదని.. మోడీ, హెగ్దే, అమిత్ షా వ్యతిరేకిని అని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. మలయాళంలో వివాదాస్పద మారిన 'సెక్సీ దుర్గ' సినిమా దర్శకుడు శశిధరన్కు ప్రకాశ్ రాజ్ మద్దతుగా నిలిచారు. ఈ సినిమా హిందూయిజం గురించి కాదని, హిందుత్వానికి వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు అడ్డుతగిలారు. మోడీ, అమిత్ షా, హెగ్దేలను హిందువులు కాదని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు స్పందించిన ప్రకాశ్ రాజ్ ఎదుటివారిని చంపమని ప్రోత్సహించేవారెవరూ తన దృష్టిలో హిందువు కాదని చెప్పారు. గౌరీ లంకేశ్ ఉదంతంపై ప్రధాని మోడీ స్పందించకపోవడం వల్ల, మోడీ హింసను ప్రోత్సహిస్తున్నారన్న అర్థం వచ్చేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు హిందువో నిర్ణయించడానికి మీరెవరని ప్రకాశ్ రాజ్ను కృష్ణ సాగర్ సూటిగా ప్రశ్నించారు. ఎప్పుడైతే తనపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారో, అప్పటి నుంచే తాను మీరు హిందువులు కాదని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm