ఆసిఫ్నగర్: నాకు ఇంజినీరింగ్ చదవడం ఇష్టం లేదు... చనిపోవాలని నిర్ణయించుకున్నాను...అని సోదరుడికి ఫోన్ చేసిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసిఫ్నగర్ ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం...నిజామాబాద్ జిల్లా, భీమగల్కు చెందిన ప్రియాంక(21), ఇబ్రహీంపట్నంలోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. మెహిదీపట్నం, సంతోష్నగర్కాలనీలోని వాసవీ హాస్టల్లో వసతి పొందుతోంది. ఈమె సోదరులు వికాస్ కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసి, నగరంలోనే ఎంటెక్ చదువుతున్నాడు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే ప్రియాంకకు ఇంజినీరింగ్ చదవడం ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు, బంధువుల సూచన మేరకు ఇంజినీరింగ్లో చేరింది. గతంలో రెండుసార్లు ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బుధవారం ఉదయం తన సోదరుడు వికాస్కు ఫోన్ చేసిన ప్రియాంక, తనకు ఇంజినీరింగ్ చదవడం ఇష్టం లేదు, చనిపోవాలనుకుంటున్నానని చెప్పింది. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఎవరూలేని సమయంలో చున్నీలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన సోదరి ఇంజినీరింగ్ ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుందని వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm