హైదరాబాద్: అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్నే నేడు నిర్వహించారు. సమావేశం సందర్భంగా మిషన్ భగీరథ పనుల పురోగతి, గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ, భూ రికార్డుల ప్రక్షాళన, హరితహారం సన్నద్ధత, గణతంత్ర వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎస్ స్పందిస్తూ.. హరితహారంపై జిల్లా కలెక్టర్లు మండలాల వారీగా ఎప్పటికప్పుడూ సమీక్షించాలన్నారు. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో స్థానిక సంస్థల, పట్టణాభివృద్ధి సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. వచ్చే సీజన్ హరితహారం విజయవంతానికి నర్సరీల్లో మొక్కల పెంపకం కీలకమని తెలిపిన సీఎస్ ప్రజలు కోరిన మొక్కలను అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. గ్రీన్ బ్రిగేడ్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని తెలిపారు. అవసరమైతే మరిన్ని బ్రిగేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. మొక్కల సంరక్షణలో గ్రామ పంచాయతీలను బాధ్యత వహించేలా అదేవిధంగా డీపీవో, ఎంపీడీవోలు చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. పట్టణాలలో మొక్కల పెంపకానికి సంబంధించి రోటరీ క్లబ్, ఎన్జీవోలు, సివిల్ సొసైటీల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm