కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జాను వ్యతిరేకిస్తూ అఖిల పక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచే దుకాణాలు.. వ్యాపార-వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా కళాశాల మైదానం నుంచి కామారెడ్డి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కబ్జాదారుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో పాటు తెరాస, భాజపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కబ్జాకు గురవుతున్న కళాశాల మైదానాన్ని కళాశాల పేరిట రిజిస్ర్టేషన్ చేయించే వరకు అఖిల పక్షాల ఆందోళన విడతల వారీగా నిర్వహించనున్నట్లు అఖిలపక్షాల నాయకులు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm