హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ దృక్పథంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యే వాతావరణం నెలకొందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయిన తెలిపారు. అవసరమైతే కోర్టుకు వెళతామంటూ తాను చేసిన వ్యాఖ్యలపై అతిగా ఫోకస్ చేశారని... తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు. మనకు ఉన్న హక్కును వినియోగించుకుంటే తప్పేముందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగానే తాను వ్యాఖ్యలు చేశానంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ టీడీపీ, జన్మభూమి కార్యక్రమం సరిగా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని కొందరు నేతలకు ఆయన ఈ సందర్భంగా సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm