కరీంనగర్: సీఎం కేసీఆర్పై గవర్నర్ నరసింహన్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్.. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. శనివారం మంత్రి హరీశ్రావుతో కలిసి గవర్నర్ నరసింహన్.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అండర్ టన్నెల్, సర్జ్పూల్ పనుల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రజెంటేషన్ ఇచ్చారని, అది చూసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్రావా.. కలల చంద్రశేఖర్ రావా.. అనిపించిందన్నారు. నేడు ప్రాజెక్టు పనులు పరిశీలించిన తరువాత తన అభిప్రాయం మారిందన్నారు. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం చంద్రశేఖర్రావుగా మారిపోయారనిపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నభూతో నభవిష్యత్ అని వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్ రావు పేరు కూడా కాళేశ్వర్ రావుగా చరిత్రకెక్కుతుందని కితాబిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజ్ పనులను క్షుణ్ణంగా పరిశీలించానని, జూన్ నాటికి కాళేశ్వరం మొదటిదశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm