హైదరాబాద్: పెండ్లికి వెళ్లే విషయంలో స్నేహితుడితో జరిగిన వాగ్వాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ ఎంబీఏ విద్యార్థిని వీడియో కాల్ లైవ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తె హనీషా చౌదరి(23) నగర శివారు కొంపల్లిలోని శివశివాని కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నది. కాలేజీ క్యాంపస్ హాస్టల్లోని రూం నంబర్ 30 లో ఉంటున్నది. శనివారం రాత్రి 11 గంటల సమయం లో హనీషా, ఆమె క్లాస్మేట్ మేడ్చల్కు చెందిన దాషీష్ పటేల్ ఫేసుబుక్ మెసెంజర్లో వీడియో కాల్ మాట్లాడుకున్నారు. మళ్లీ అర్ధరాత్రి 1.18 గంటల నుంచి 1.34 వర కు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో హనీషా వీడియో కాల్ను అలాగే పెట్టి గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నది. ఈ పరిణామంతో షాక్కు గురైన దాషీష్ పటేల్ మేడ్చల్ నుంచి కొంపల్లిలోని కాలేజీ హాస్టల్కు చేరుకొని జరిగిన విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. తలుపులు వేసి ఉండటంతో పగులగొట్టి ఫ్యాన్కు వేలాడుతున్న హనీషా ను కిందికి దించారు. వెంటనే స్థానిక ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా హనీషా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. హనీషా తండ్రి బుగ్గయ్య చౌదరి ఇచ్చిన ఫిర్యా దు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా దాషీష్ పటేల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హనీషా చౌదరి సెల్ఫోన్, ల్యాప్టాప్ను, దాషీష్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. హనీషా చౌదరి, దాషీష్ పటేల్ మధ్య జరిగిన చాటింగ్లు, వీడియో కాల్స్, ఫోన్ సంభాషణాలు, సోషల్ మీడియాలోని వీరి పోస్టింగ్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హనీషా, దాషీష్ ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. అనంతపురం జిల్లాలో జరిగే ఓ పెండ్లికి గతంలో తనతో సన్నిహితంగా ఉన్న ఓ ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నట్టు హనీషా చెప్పింది. తనకు ఏమీ అభ్యంతరం లేదని దాషీష్ చెప్పాడు. తాను ఫ్రెండ్తో కలిసి తప్పనిసరిగా పెండ్లికి వెళ్తానని హనీషా మరోసారి చెప్పడంతో, దాషీష్ నీ ఇష్టమని సమాధానం ఇచ్చాడు. దీంతో నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావ్.. నన్ను అనుమానిస్తున్నావ్ అంటూ దాషీష్తో గొడవపడింది. తనకు ఎలాంటి అనుమానం లేదని దాషీష్ చెప్పినా హనీషా వినకుండా చనిపోతానంటూ కోపంలో ఉరి వేసుకున్నదని సమాచారం. వారిద్దరి ఫోన్ సంభాషణాలను పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm