కర్ణాటక: కర్ణాటక రాజధానిలోని బృహత్ బెంగళూరు మహానగర పాలక కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణస్వామి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశారు. రెవెన్యూ అధికారి చెంగల్ రాయప్ప టేబుల్ వద్దకు బాటిల్ లో పెట్రోల్ తీసుకొచ్చిన నారాయణస్వామి, దానిని గోడలపై చల్లుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ తతంగాన్ని మొత్తం ఎవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో పెట్రోలు చల్లుతున్న నారాయణస్వామిని చెంగల్ రాయప్ప బతిమాలుతుండడం కూడా రికార్డు కావడం విశేషం. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా, ఇటీవల పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు ఓ యువకుడిని దారుణంగా కొట్టడంతో అతనిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఉపశమన చర్యలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. దీనిపై బెంగళూరు నగర అభివృద్ధి మంత్రి కేజే జార్జ్ మాట్లాడుతూ, కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లిన ద్రవాన్ని పరిశీలించగా పెట్రోల్ గా నిర్ధారణ అయిందని, నారాయణస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm