ఢిల్లీ: జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ హరిబాబు స్వాగతించారు. హోదా బదులుగా ఇచ్చిన ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని, పవన్ ప్యాకేజీ గురించి వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషమని హరిబాబు కొనియాడారు. పవన్ కల్యాణ్ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ప్రకటించిన పవన్.. ప్రత్యేక హోదా పెద్ద విషయం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు రావడమే ముఖ్యమని ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడుతామని చెప్పిన పవన్ ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. బీజేపీని అనుసరించే పవన్ ఇలా మాట్లాడి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm