హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు మధ్య పాతకక్షలేవో ఉన్నట్టు అనిపిస్తోందని, వీరిద్దరి మధ్య విభేదాల వల్ల ప్రజలు బాధపడుతున్నారని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను ఎన్డీఏ భాగస్వామిని...ఏం జరుగుతుందో నాకు తెలియదా? కేంద్రం రంగంలోకి దిగి పోలవరంలో ఏం జరుగుతుందో చూడాలి. నన్ను బీజేపీ నడిపిస్తుందనేది అవాస్తవం' అని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొట్టిపారేశారు. రాష్ట్రంలో అవినీతిపై పలుమార్లు సీఎం చంద్రబాబుతో చెప్పానని, అవినీతి నిర్మూలనకు సీఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జనసేనాని దుయ్యబట్టారు. రెండు, మూడేళ్లుగా అవినీతి గురించి వింటున్నానని, తొలుత విపక్షాల ఆరోపణలుగా పెద్దగా పట్టించుకోలేదని, టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలే ఈ విషయం చెప్పారని ఆయన వెల్లడించారు. కొందరు వ్యక్తుల కనుసన్నల్లోనే వ్యవహారాలన్నినడుస్తున్నాయని, చంద్రబాబుకు కూడా అవినీతి గురించి తెలుసని మరోసారి ఆరోపించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్.... కేంద్రం నిర్మించాలని, కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకే రాష్ట్రం నిర్మాణం చేపట్టిందని పవన్ విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm