అనంతపురం: జిల్లాలో జనసేన కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, పవన్పై చేసిన ఆరోపణలకు ప్రతివిమర్శ చేసిన జనసేన కార్యకర్తలపై పోలీస్స్టేషన్లో అక్రమ కేసు పెట్టించి వారిని ఇన్స్పెక్టర్తో తిట్టించడమే కాకుండా 40 మంది కార్యకర్తలను సాయంత్రం 5గంటల నుంచి 10 వరకు లాకప్లో ఉంచడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందంటూ ఓ ప్రకటనలో జనసేన పేర్కొంది. జనసేన నుంచి టీడీపీలో చేరమని బెదిరించి.. అందుకు నిరాకరించిన రొద్దం మండలానికి చెందిన సుబ్రమణ్యం అతని సోదరుడిపై మాజీ జడ్పీటీసీ సభ్యుడు తన అనుచరులతో దాడి చేయించడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ఈ రెండు ఘటనలపై అనంత జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా జనసేన విజ్ఞప్తి చేసింది. అయితే ఈ లేఖపై టీడీపీ నేతలు, పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Mon Jan 19, 2015 06:51 pm