అజంగఢ్: దేశ నేతల విగ్రహాల విధ్వంసకాండ దేశంలోని ఏదోమూల కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్ అజంగఢ్లోని బచావల్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు అగంతకులు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్తుతెలియని దుండగులపై కేసు నమోదు చేశారు. ఈనెల 10న కూడా అజంగఢ్లోని రాజపట్టి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు అగతంకులు ధ్వంసం చేశారు. దానికి ముందు, మీరట్లోనూ అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు టార్గెట్ చేశారు. కాగా, సోమవారం ఉదయం కోల్కతాలో మరో ఘటన వెలుగుచూసింది. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ క్యాంపస్లో ఉన్న జన్సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ నేమ్ప్లేట్పై కొందరు ఇంకు పూశారు.
Mon Jan 19, 2015 06:51 pm