హనాయ్: వియాత్నాంలోని హో చి మిన్ నగరంలో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంటులో మంటలు చెలరేగడంతో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున వో వాన్ కీ స్ట్రీట్లోని కెరినా ప్లాజా వద్ద ఓ అపార్ట్మెంటులో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. క్షణాల్లో అపార్ట్మెంటు మొత్తం అగ్నికీలలు వ్యాపించడంతో వందలాది మంది లోపలే చిక్కుబడిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ ప్రివెన్సన్ అండ్ ఫైటింగ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు పై ఫ్లోర్లోకి పరుగెత్తగా.. మరికొందరు భయంతో బయటికి దూకి తప్పించుకున్నట్టు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ప్రమాద సమయంలో భవనంలోని అగ్నిమాపక వ్యవస్థ పనిచేయడం లేదని బాధితులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm