చిక్బళ్లాపుర: పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న కొందరు రైతులకు మట్టి కుప్పలో నుంచి గుక్క తిప్పుకోనివ్వని ఓ పసిగుడ్డు రోదన వినిపించింది. మొదట్లో ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తున్నదో అర్థం కాలేదు. తమకు దగ్గర్లోనే ఆ మట్టి కుప్ప ఉన్నప్పటికీ.. అందులో నుంచి ఏడుపు శబ్దం ఎలా వస్తుందనే అనుమానం వారిని కమ్మేసింది. సుమారు 10-15 నిమిషాల పాటు చుట్టుపక్కల వెదికినప్పటికీ.. ఆ ఏడుపు వినిపించిన ప్రదేశాన్ని గుర్తు పట్టలేకపోయారు. చివరికి- ఏదైతే అదే అయిందనుకుని ఆ మట్టికుప్పను తవ్వి చూడగా.. మగబిడ్డ కనిపించింది. అప్పటికీ ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే వారు అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఆ శిశువును మొదట కరుబూరు ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన కర్ణాటకలోని చింతామణి తాలూకా గడదాసనహళ్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై చింతామణి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm