ముంబయి: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ ఐపీవో ఇన్వెస్టర్లకు నిరాశే మిగిల్చింది. ఈ నెల 15న పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న బీడీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 428కాగా.. బీఎస్ఈలో రూ. 65 తక్కువగా రూ. 363 వద్ద లిస్టయ్యింది. ఇది 15 శాతం నష్టంకాగా.. ఇంట్రాడేలో రూ. 403 వద్ద గరిష్టాన్నీ, రూ. 360 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. చివరికి 8.5 శాతం(రూ. 37) నష్టంతో రూ. 391 సమీపంలో ముగిసింది. ఐపీవో ద్వారా కేంద్ర ప్రభుత్వం విభిన్న మిసైల్స్తోపాటు రక్షణ రంగానికి అవసరమయ్యే పలు పరికరాల తయారీలో పేరొందిన భారత్ డైనమిక్స్లో 12 శాతం వాటా(2.21 కోట్ల షేర్ల)ను విక్రయించింది. తద్వారా రూ. 961 కోట్లను సమీకరించింది. ఇష్యూ ధరలో కంపెనీ ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం రూ. 10 ధరను డిస్కౌంట్ ఇచ్చిన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం కోలుకుని 8 శాతం నష్టంతో రూ. 395 వద్ద ట్రేడవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm