హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు వేతనాల పెంపు విషయంలో సీఎం ప్రకటనతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు అన్నారు. సోమవారం టీఎస్ ఆర్టీసీ సంఘాలు, జేఏసీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, వేతనాల పెంపు తదితర విషయాలపై చర్చించారు. అనంతరం హనుమంతు మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీలో 2011 నుంచి ఇప్పటి వరకు నియామకాలు జరగలేదన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న సీఎం మాటను నిలబెట్టుకోవాలని కోరారు. వేతనాల పెంపు విషయంలో ముఖ్యమంత్రి బెదిరింపులకు గుర్తింపు సంఘం చతికలపడిందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని హనుమంతు హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm