సంగారెడ్డి: విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం... ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం సమక్షంలో పలువురు తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆహ్వానిస్తున్నామని.. ఇప్పటివరకు సుమారు 1300మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. వీరందరికి ఈనెల 27న హైదరాబాద్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పన్ను వసూలు చేస్తున్నందున సరుకు రవాణా చేసే వాహనదారులు పక్క రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారని.. దీని ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించకపోవడంతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయని.. దీనిపై ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm