డీల్లీ: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో అరుదైన ఘనత సాధించింది. ఇటీవలే దేశీయ తొలి 100 బిలియన్ డాలర్ల ఐటీ కంపెనీగా రికార్డు సృష్టించిన టీసీఎస్.. తాజాగా ఆ రికార్డును బద్దలుకొట్టి రూ.7లక్షల కోట్ల మైలురాయికి దూసుకెళ్లింది. శుక్రవారం నాటి మార్కెట్ ఆరంభంలో టీసీఎస్ షేర్లు రాణించడంతో సంస్థ మార్కెట్ విలువ రూ.7,03,309కోట్లకు చేరింది. ఈ ఉదయం టీసీఎస్ షేరు విలువ 1.91శాతం పెరిగి రూ. 3,647గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సంస్థ షేరు విలువ 35శాతం వరకు పెరిగింది. టీసీఎస్ తర్వాత రూ. 5.83లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో స్థానంలో ఉంది. రూ.5.19లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ, రూ. 3.42లక్షల కోట్లతో హెచ్యూఎల్, రూ. 3.30లక్షల కోట్లతో ఐటీసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత నెలలోనే టీసీఎస్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను దాటిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఐటీ కంపెనీ ఇదే కావడం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm