భోపాల్ : గత కొన్నేళ్ల నుంచి ఓ దళిత రైతు భూమిలో యాదవ కులస్తులు వ్యవసాయం చేసుకుంటున్నారు. తన భూమి తనకు ఇచ్చేయండి అని అడిగినందుకు ఆ దళిత రైతుపై పెట్రోల్ పోసి నిప్పటించారు యాదవ కులస్తులు. ఈ దారుణ ఘటన భోపాల్ జిల్లాలోని పరేషియా - ఘాట్కేడి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 62 ఏళ్ల కిశోరిలాల్ జాదవ్ అనే దళిత రైతు భూమిని అదే గ్రామానికి చెందిన ఓ యాదవ కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటుంది. అయితే ఇటీవలే తన భూమిని తనకివ్వండి అంటూ యాదవ కుటుంబాన్ని కిశోరిలాల్ కోరాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇక గురువారం సాయంత్రం కిశోరిలాల్, ఆయన భార్య తాంఖియా కలిసి రైతు తిరన్ సింగ్ యాదవ్ను కలిసి తమ భూమి తమకిచ్చేయండి అని ప్రాధేయపడ్డారు. అదేమీ వినిపించుకోని యాదవ్.. కిశోరిలాల్పై పెట్రోల్ పోసి నిప్పటించారు. రైతును సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రైతు కిశోరిలాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరన్ సింగ్ యాదవ్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm