రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆర్థిక వనరులు ఎట్లా?అన్నదే ప్రధాన సమస్యగా ఉందన్నారు. రాజకీయ పార్టీ పెడితే రాష్ట్రంలో బీసీ ఉద్యమం భగ్గుమంటుందని, ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెప్పారు. ఆర్థిక మద్దతు దొరికితే గన్ పేల్చుతానని ప్రకటించారు. అప్పుడు కోటల గోడలు కూలిపోతాయని అన్నారు. తన ప్రతి అడుగూ రాజ్యాధికారం దిశగానే పడుతోందని చెప్పారు. ఎక్కడికెళ్లినా రాజకీయ పార్టీ పెట్టాలని అడుగుతున్నారని అన్నారు. పార్టీ పెట్టాలని తనకు కార్యకర్తల కంటే ఎక్కువ ఉత్సాహం ఉందని చెప్పారు.
తమ్మినేని వీరభద్రం బీఎల్ఎఫ్లోకి రావాలని అడిగారని అన్నారు. అనేక మంది సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్లు 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. బీసీలకు బీఎల్ఎఫ్ 65 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని ప్రకటించిందని, మిగతా పార్టీలూ ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్రంలో 9 ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలు జెండాలు మోయడానికి, జిందాబాద్లు కొట్టడానికే పనికొస్తారా?అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారని, తెలంగాణలో ఎందుకు కాలేరని అన్నారు. ఈనెల 26న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్, బీఎల్ఎఫ్ కన్వీనర్లు గొర్రె రమేష్, గుజ్జ రమేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, తెలంగాణ ప్రయివేటు విద్యాసంస్థల జేఏసీ నేత గౌరి సతీష్, ఎంఐఎం కార్పొరేటర్ రాజేందర్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 05:55PM