తమ పార్టీ నేత దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై టీపీసీసీ సీనియర్ నేత వీ హనుమంతరావు స్పందించారు. ఈరోజు హైదరాబాద్లోని సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ... ఎవరు వెళ్లిపోయినా పార్టీకి కొద్దిగా నష్టం జరుగుతుందని, ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలనే విషయంపై తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు. రేపు ఉదయం దానం నాగేందర్తో మాట్లాడి పార్టీని వీడకుండా చూస్తామని చెప్పారు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తాము వీలైనంతవరకు వారితో చర్చలు జరిపి సర్దిచెప్పాలనే ప్రయత్నిస్తామని తెలిపారు. ముఖేష్ గౌడ్ పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉందని, అలాగే దామోదర రాజనర్సింహా అసంతృప్తితో ఉన్నారన్న విషయం తనకు తెలియదని అన్నారు. తమ పార్టీని రాష్ట్రంలో బలపర్చుతున్నామని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm