హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం సుందరీకరణ, అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను రచిస్తున్నట్లు అటవీ, పర్యావరణం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కుంటాల జలపాతం అభివృద్ధిపై అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎండీ చందన్ మిత్రాలతో కలిసి మంత్రి జోగు రామన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కుంటాల జలపాతం రాష్ర్టంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని, రాష్ర్టంలోనే ఎత్తయిన జలపాతం అని మంత్రి అన్నారు. కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు రాష్ర్టం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారని అన్నారు. కుంటాల జలపాతంలో పడి ప్రతి ఏటా పలువురు చనిపోవడం బాధాకరమన్నారు. కుంటాలను సుందరీకరణ చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, ప్రమాదాల నివారణ కోసం పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు రూ.10 కోట్లతో కార్యాచరణను సిద్ధం చేసినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. కుంటాల జలపాతం వద్ద ఎకో టూరిజంను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm